Wednesday, 7 February 2018

రవీంద్రనాధ్ కౌశిక్

23ఏళ్ళ ఒక బ్రాహ్మణుడు పూర్తిగా ముస్లీం గా మారాడు..
రవీంద్రనాధ్ కౌశిక్ " నబీ అహ్మద్ షకీర్ " అయ్యాడు..

దేనికోసం? దేశంకోసం..

ఆమహనీయుడు "బ్లాక్‌టైగర్"  వీరోచిత, విషాదాంతగాధతెలుసుకొందాం, నివాళులర్పిద్దాం..
....................

స్వాతంత్ర్య పోరాట సమయంలో, దేశం కోసం ప్రాణాల్ని అలవోకగా వదిలేసిన ఎంతో మంది వీరుల్ని మనం ఎప్పుడో ఒకప్పుడు తలుచుకుంటూ ఉంటాం. కానీ స్వతంత్ర్యానంతర భారతంలో సైతం, తన ప్రాణం కంటే దేశమే ఎక్కువ అని భావించి, మెల్లమెల్లగా ప్రాణాన్ని శత్రువులు తోడేస్తున్నా, క్రూరమైన చిత్రహింసలు నరకాన్ని చూపిస్తున్నా, స్వదేశ రహస్యాల గుట్టు విప్పకుండా, దేశం కోసం వీరమరణం పొందిన ఆ దేశభక్తుడి గురించి మనలో చాలా మందికి తెలియకపోవడం దురదృష్టకరం.

రవీంద్రనాథ్ కౌశిక్. 1952, జూలై 26న రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచీ కౌశిక్ కు నాటకాలంటే ఇష్టం. దీంతో గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యేలోపే, నటనలో అద్భుతమైన పేరు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా దేశభక్తి ఉన్న కథాంశాలను ఇతివృత్తంగా తీసుకుని రక్తి కట్టించడంలో కౌశిక్ కు మరెవరూ సాటిరాలేకపోయారు. అలా ఒక నాటకంలో చైనాకు రహస్యాలు చెప్పడానికి నిరాకరిస్తున్న భారతీయ ఏజెంట్ గా కౌశిక్ వేసిన పాత్ర, అది చూస్తున్న భారతీయ రహస్య నిఘా విభాగం (రా) అధికారుల్ని కట్టిపడేసింది. ఇతనికి ట్రైనింగ్ ఇస్తే, దేశంలో మునుపెన్నడూ లేని ఒక సీక్రెట్ ఏజెంట్ ను తయారుచేయగలమని వారికి అర్ధమైంది.

అప్పటికి 23 ఏళ్ల కుర్రాడు కౌశిక్. అతన్ని ఒప్పించగలమా లేదా అన్నది వారికి సందేహంగానే ఉంది. అయితే, ‘రా’ అధికారులు అడిగీ అడగ్గానే కౌశిక్ ఎగిరి గంతేశాడు. దేశం కోసం తన ప్రాణాలనైనా తీసేసుకోమంటూ కౌశిక్ ఆనందంగా ఒప్పుకున్నాడు. అతన్ని ఢిల్లీ తీసుకువెళ్లి, రెండేళ్ల పాటు అత్యంత తీవ్రమైన, కష్టమైన ట్రైనింగ్ ఇచ్చారు అధికారులు. శారీరకంగా, మానసికంగా అతన్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దింది రా. ఇక ఆ తర్వాత ఇస్లాం మత సంప్రదాయం, మూలాలు, ఖురాన్ గ్రంథం, పాకిస్థాన్ యాసలో ఉర్దూ, హిందీ భాషలు మాట్లాడటం లాంటివన్నీ కౌశిక్ వంటపట్టించుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ దొరక్కూడదని సున్తీ సైతం చేయించుకున్నాడు. ఒక ముస్లింగా తాను ఎలా మసులుకోవాలన్నదాంట్లో, రా అధికారులే ఆశ్చర్యపోయేంతగా తనను తాను మార్చేసుకున్నాడు 23 ఏళ్ల కౌశిక్.

ఇక 1975లో దేశాన్ని విడిచిపెట్టి, సౌదీ అరేబియాకు వెళ్లి, అక్కడి నుంచి దుబాయ్ కు, అటు నుంచి పాకిస్థాన్ కు ప్రణాళిక ప్రకారం చేరుకున్నాడు కౌశిక్. “నబీ అహ్మద్ షకీర్”గా పేరు మార్చుకుని అక్కడే రెండేళ్ల పాటు లా కాలేజీలో చదివి, గ్రాడ్యుయేట్ పట్టా పొందాడు. పట్టా చేతికి వచ్చిన తర్వాత, పాకిస్థాన్ ఆర్మీలో చిన్న స్థాయిలో ఉద్యోగంలో చేరాడు. తన తెలివితో, చురుకైన వ్యక్తిత్వంతో అంచెలంచెలుగా ఎదిగి, పాకిస్థాన్ ఆర్మీ మేజర్ స్థాయికి చేరిపోయాడు. స్థానికంగా పాకిస్థాన్ లో మమేకమవ్వడానికి, అమానత్ అనే పాకిస్థాన్ అమ్మాయిని పెళ్లాడి, ఒక బిడ్డకు జన్మనిచ్చాడు. పూర్తిగా పాకిస్థాన్ సైన్యంలో కలిసిపోయి, తనపై ఎవరికీ ఎలాంటి అనుమానం లేకుండా పాక్ సీక్రెట్స్ అన్నీ భారత ప్రభుత్వానికి నిరంతరం చేరవేస్తూ వచ్చాడు.

1979 నుంచి 1983 మధ్యలో పాకిస్థాన్ ప్లాన్ చేసిన ఎన్నో అత్యున్నత స్థాయి రహస్యాల్ని ఛేదించి, వాటిని భారత రక్షణ శాఖకు సమర్ధవంతంగా అందించగలిగాడు. భారత ఇంటెలిజన్స్ వర్గాల్లో, కౌశిక్ ను ‘బ్లాక్ టైగర్’ అని పిలుచుకునేవారు. స్వయంగా ఇందిరాగాంథీయే కౌశిక్ కు ఆ పేరు పెట్టారని అంటారు. కౌశిక్ అందించిన సమాచారం కారణంగా, యుద్ధతంత్రాల్లో భారతదేశం ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండి పాకిస్థాన్ ప్లాన్స్ కు చెక్ పెట్టేది. చాలా సార్లు పాకిస్థాన్ బోర్డర్ల వెంట యుద్ధానికి తెగబడి, ఆక్రమించాలని పాక్ ప్లాన్స్ వేసింది. కానీ వాటన్నింటినీ ముందుగానే భారత ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొని, ఊహించని ప్రమాదాల్ని అడ్డుకోగలిగింది. అంతా బ్లాక్ టైగర్ చలవే..!

ఇలా శత్రువు సైన్యంలోనే చేరి, ధైర్యంగా భారతదేశంకోసం పనిచేస్తున్న బ్లాక్ టైగర్, ఇన్యాత్ మాసీ అనే భారత అధికారి తెలివితక్కువతనం కారణంగా పట్టుబడ్డాడు. కౌశిక్ కు భారతదేశం తరపున కొన్ని విషయాల్ని చేరవేయాలని ఇన్యాత్ మాసీ అనే ఒక ఎంట్రీ లెవల్ ఏజంట్ ను ఇండియా పాకిస్థాన్ బోర్డర్ కు పంపించారు భారత అధికారులు. చాలా రహస్యంగా పని ముగించుకుని రావాల్సిన ఇన్యాత్, బోర్డర్లో పాక్ సైన్యానికి చిక్కాడు. అప్పటికైనా, కాస్త తెలివిగా వ్యవహరించి ఉంటే బాగానే ఉండేది. కానీ ఆర్మీ కాస్త బెదిరించగానే, బ్లాక్ టైగర్ గురించిన రహస్యాలన్నింటినీ ఇన్యాత్ కక్కేశాడు. అక్కడితో కౌశిక్ సాహసాలకు బ్రేక్ పడింది. అతని జీవితంలో నరకానికి తెర లేచింది. విషయం తెలియగానే కౌశిక్ ను అదుపులోకి తీసుకుంది పాక్ ప్రభుత్వం.

ఇన్నాళ్లుగా, తమ ప్లాన్స్ కు ఎక్కడ గండిపడుతుందో అర్ధం కాక వెర్రి కోపంతో ఉన్న పాక్ ప్రభుత్వం, అధికారులు, తమ కోపాన్నంతా బ్లాక్ టైగర్ పై తీర్చుకున్నారు. రెండేళ్ల పాటు, ప్రతిక్షణం నరకాన్ని చూపించారు. ఏ మనిషి కూడా బ్రతికుండగా తట్టుకోలేని టార్చర్ ను కౌశిక్ పై ప్రయోగించింది. అన్నింటినీ దేశం కోసం పంటిబిగువున బిగబట్టి, భరించాడే తప్ప, ఏనాడూ దేశ భద్రతకు సంబంధించిన విషయాల గురించి నోరు విప్పలేదు.

కౌశిక్ ను టార్చర్ చేసి, భారత ప్రభుత్వాన్ని తప్పు ఒప్పుకునేలా చేసి, ప్రపంచదేశాల ముందు దోషిగా నిలబెట్టాలనుకుంది పాక్. ఆ కారణంగానే భారత ప్రభుత్వం కౌశిక్ ను కాపాడటానికి ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలోకి వెళ్లిపోయింది. ఒకవేళ కౌశిక్ మా వాడే అని ఒప్పుకుంటే, అతన్ని కాపాడవచ్చు కానీ, ప్రపంచదేశాలన్నీ వేలెత్తి చూపడమే కాక, కొత్త నిబంధనల్ని దేశంపై విధిస్తాయి. అది దేశ ప్రతిష్టకు మాయని మచ్చగా మిగిలిపోతుంది. దీంతో వేరే దారిలేని ప్రభుత్వం, కౌశిక్ మా దేశం వాడు కాదు అని తేల్చి చెప్పేసింది.

కౌశిక్ ను బంధించి, సియాల్ కోట్ జైలులో ఉంచి తమ దారుణ శిక్షలకు తెరలేపారు. తాను భారతదేశం వాడినే అని ఒప్పుకోవాలని, అతనికి తెలిసిన భారతదేశ మిలిటరీ సీక్రెట్స్ అన్నీ తమకు చెప్పాలని పాక్ అధికారులు ఎన్ని సార్లు అడిగినా కౌశిక్ నోరు విప్పలేదు. గోళ్ల మధ్యలో బ్లేడు పెట్టి, అతని గోళ్లు పెకలించారు. ఒంటి నుంచి రక్తం కారేలా లాఠీలతో, ముళ్ల గదలతో చితకబాదారు. కొరడాతో వీపు చర్మం చీరిపోయేలా కొట్టారు. ఒళ్లంతా పుండ్లు పడి రక్తం కారుతుంటే, వాటిపై కారాన్ని అద్దేవారు. పురుగులు కలిపిన అన్నాన్ని బలవంతంగా తినిపించేవారు. రోజుల తరబడి తిండి పెట్టకుండా, అతని మలమూత్రాల్ని అతనే తినేలా చేశారు. చెప్పనలవి కాని, థర్డ్ డిగ్రీ శిక్షలు సైతం చిన్నబోయే ఎన్నో శిక్షల్ని అతి క్రూరాతిక్రూరంగా, బ్లాక్ టైగర్ పై ప్రయోగించారు. కానీ వాళ్లు ఎంత చేసినా, ఆ భారత పులి నోరు విప్పలేదు. అతని నిబ్బరాన్ని చూసి, పాక్ అధికారులే ఆశ్చర్యపోయారంటేనే అర్ధం చేసుకోవచ్చు టైగర్ అన్న పేరు కౌశిక్ కు ఎంత కరెక్ట్ గా సరిపోతుందో..!

ఎక్కడ భారత ప్రభుత్వం రహస్యంగా అతన్ని తప్పించుకుని తీసుకెళ్లిపోతుందోనని, రోజుకో జైలు మార్చేవారు. సియాల్ కోట్ నుంచి కోట్ లఖ్ పత్, అక్కడి నుంచి మియాన్ వాలీ, అక్కడి నుంచి ముల్తాన్ జైళ్లకు కౌశిక్ ను మారుస్తూ ఉండేవారు. అతన్ని టార్చర్ చేసీ చూసీ, ఇక చెప్పేలా లేడని, 1985లో కౌశిక్ కు ఉరిశిక్ష విధించింది. ఉరి పడినా కౌశిక్ కు ఈ నరకం నుంచి విముక్తి లభించేదేమో..అతనికి ఆ అదృష్టాన్ని కూడా దక్కనివ్వకుండా ఉరిశిక్షను రద్దు చేసి, యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. వారు అతనిపై చేసిన దారుణాలకు, అకృత్యాలకు, కౌశిక్ కు టీబీ, ఆస్తమా వచ్చింది. మందులు వాడితే బతికేస్తాడన్న భయంతో కనీసం టాబ్లెట్స్ వేయకుండా, డాక్టర్ కు చూపించకుండా నిర్లక్ష్యం వహించింది పాక్ ప్రభుత్వం. దీంతో జబ్బు బాగా ముదిరిపోయి, 1999లో తన పుట్టిన తేదీ అయిన జూలై 26నే కన్నుమూశాడు బ్లాక్ టైగర్.

అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ, భారతదేశపు గూఢాచారుల్లో అగ్రస్థానంలో ఉంటాడు రవీంద్ర కౌశిక్. అతని లాంటి మరొక గూఢచారి దొరుకుతాడా అంటే అనుమానమే. ఒకవేళ భారత రక్షణ శాఖ పంపిన ఇన్యాత్ మాసీ కనుక కౌశిక్ గురించి చెప్పకుండా ఉండి ఉంటే, నేటికీ పాకిస్థాన్ ఆర్మీలో మన టైగర్ మారువేషంలో తిరుగుతూనే ఉండేది. శత్రుదేశ రహస్యాలు సేకరిస్తూనే ఉండేది. కౌశిక్ మరణించి ఉండవచ్చు కానీ, అతని పేరు మాత్రం, భారతదేశ చరిత్రలో చిరకాలం నిలిచి ఉండిపోతుంది...... చివరిగా ఒక చిన్న మాట, మన దేశభక్తి ని నిరూపించుకోడానికి మనం అందరం మిలట్రీలో చేరక్కర్లేదు...కనీసం ఇలాంటి వాళ్ళ చరిత్ర చదివినా దేశభక్తి ఉన్నట్టే... ఇదీ మన జాతికున్న నిరూపమాన దేశభక్తి...జైహింద్..

కాంతివేగమును ఎవరు లెక్కించారు

కాంతివేగమును ఎవరు లెక్కించారు .?
భారతీయుల ఘనత .? విదేశీయుల ఘనత ..?

కానీ పాశ్చాత్య ప్రపంచం,
కాంతివేగాన్ని లేక్కించినది క్రీ.శ 1975లో “రోమార్” అనే ఘనుడు అంటుంది. ఇందులో నిజం లేదు.
1. ప్రసిద్ధ ప్రాచీన భాష్యకారులు కింది బుగ్వేద శ్లోకానికి
“తరణిర్విశ్వధర్శతో జ్యోతిష్క్రుదాసి సూర్య విశ్వమాభాసిరోచనమ్II (1.50.4-బుగ్వేదం)

2. భాష్యంగా సాయనాచార్యులు కాంతి వేగాన్ని వర్ణిస్తూ ఒక శ్లోకం రాశారు.
“యోఢజనానాం సహస్రం ద్వే ద్వేశాతే ద్వే చ యేజనేI
ఎకేక నిమిషార్దేన క్రమమాణ నమో స్తుతే II”

అనగా అరనిమిషానికి 2202 యేజనాల దురం ప్రయాణించు ఓ కాంతి కిరణమా నీకు నమస్కారము
అని భావం.
ఇక్కడ 1 యోజనము = 9 మైళ్ళ 160 గజాలు. ఇది 9.11 మైళ్ళకు సమానము.
భారతీయ కాలగమన ప్రకారం .. 1 పగలు, రాత్రి = 810000 అర్ద నిమిషాలు. అనగా 1 సెకనుకు 8.75 అర్ద నిమిషాలు. కనుక ప్రతి అరనిమిషమునకు.
2202 X 9.11 = 20060.22 మైళ్ళు అట్లే
20060 X 8.75 = 188064 మైళ్ళు ప్రతి సెకనుకు.
ఇది ఆధునికలు కనుగొన్న కాన్తివేగానికి దాదాపు సమీపముగానే ఉన్నదీ. 20వ శతాబ్దనికి చెందిన శాస్త్రజ్ఞులు, మేకీల్ సన్స్, మోర్లె కాంతి వేగం 1,86,300 మైళ్ళు – ఒక సెకను అని కనుగొని ఉన్నారు. ప్రస్తుతానికి అది ప్రమాణము.  సాయణాచార్యులు చెప్పిన విషయం 1890వ సంవత్సరంలో మాక్సు ముల్లర్ సంకలనం చేసిన “ఋగ్వేదం” అను ఆంగ్ల గ్రంధంలో కూడా ప్రస్తావించబడింది. మాక్సుముల్లర్ సాయణాచార్యులు క్రీ.పూ. 1395లో రచించిన బుగ్వేద భాష్యం నుంచి ఈ విషయాలు గ్రహించారు. దీని అసలు ప్రతి నేడు వడోదరాలోని కేంద్ర గ్రంధాలయంలో భద్రపరచబడి ఉంది.
గమనిక: యోజనం అనగా 9మైళ్ళు అని అర్ధ శాస్త్రంలో చెప్పబడింది. 9మైళ్ళు అనగా 8,000 ధనస్సుల దూరం. ఒక్కొక్క ధనువు పొడవు 6 అడుగులు. కానీ ఆర్యభట్టుడు, బ్రహ్మగుప్తుడు మొదలైన ఖగోళ శాస్త్రజ్ఞులు (500 ఎ.డి) అంచనా ప్రకారం ఒక యోజనం అంటే నాలుగు క్రోసులు. అనగా దాదాపు 8 మైళ్ళు.
భారతదేశంలో పుట్టినందుకు ఆనందపడు... భారతీయునిగా జీవిస్తునందుకు గర్వపడు....
Thotapalli Sridhar Sarma గారి వాల్ నుండి.

Sunday, 4 February 2018

విద్యుత్అగస్త్య మహర్షి

#విద్యుత్#   @..అగస్త్య మహర్షి..@

విద్యుత్ ను గురించి
అగస్త్యమహర్షి రచించిన అగస్త్య సంహితలోని కొన్ని పుటలు ఇప్పుడు లభిస్తున్నాయి.
వాటిలో ఘటవిద్యుత్ గురించి ఉంది ఆ వర్ణన చదవండి.

“సంస్థాప్య మృణ్మయే పాత్రే తామ్రపత్రం సుసంస్మృతమ్I
ఛాదయే ఛ్ఛిఖిగ్రీవేన చార్థ్రాభిః కాష్ఠపాంసుభిఃII
దస్తాలోప్టో నిథాతవ్యః పారదాఛ్ఛాది దస్తతఃI
సంయోగా జ్ఞాయతే తేజో మిత్రావరుణ సజ్ఞ్గితమ్II”

దీని భావం -
ఒక మట్టి కుండను తీసుకుని దానిలో రాగి పలక పెట్టాలి.
తరువాత దానిలో మైలు తుత్తం వేయాలి. తర్వాత మద్యలో తడిసిన ఱంపపు పొట్టువేయాలి.
పైన పాదరసము మరియు యశదము (జింక్) వేయాలి తర్వాత తీగలను కలపాలి అప్పుడు దాని నుండి మిత్రావరుణ శక్తి ఉద్భవిస్తుంది.

మరో శ్లోకం చూడండి

“అనేన జలభంగోస్తి ప్రాణోదానేషు వాయుషుI
ఏవం శతానాం కుంభానాం సంయోగ కార్యకృత్ స్మృతఃII
వాయు బంధక వస్త్రేణ నిబద్దో యానమస్తకేI
ఉదాన స్వలఘత్వే విభర్త్యాకాశయానకమ్II”

దీని భావం -
ఒక వంద కుండల యెక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే, నీరు తన రూపాన్ని మార్చుకుంటుది. ప్రాణవాయువు,
ఉదజని వాయువులుగా విడిపోతుంది.
ఉదజని వాయువును వాయునిరోధకవస్త్రంలో బంధిచినచో అది విమాన విద్యకు ఉపకరిస్తుంది.
అగస్త్య సంహితలో 6 రకాల విద్యుత్తుల గురించి వివరించారు.

1. తడిత్ –
పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది.
2. సౌదామిని –
రత్నముల ఘర్షణ నుండి పుట్టునది.
3. విద్యుత్ –
మేఘముల ద్వారా పుట్టునది.
4. శతకుంభి –
వంద సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది
5. హృదని –
స్టోర్ చేయబడిన విద్యుత్తు.
6. అశని –
కర్రల రాపిడి నుండి పుట్టునది.

ఇంత వివరంగా ఇచ్చిన సమాచారం ఉంటే కొందరు ఆంగ్లమానస పుత్రులు అన్నీ మన శాస్త్రాలలో ఉన్నాయిష అని వ్యంగ్యంగా అంటూ ఉంటారు.
వీరి కళ్ళకున్న ఇంగ్లీషు కళ్ళజోడు, ఎర్ర కళ్ళద్దాలు తొలిగిస్తే కనబడతాయి.
ఆంగ్లేయులు వ్రాసిన చరిత్ర చదువుతారు.
భారత దేశం మీద ప్రేమ ఎక్కువ ఉంటే అంటూ సలహా ఇస్తారు.

*సంస్కృతం రాదు. చదవడానికి, వెదకడానికి వీరికి సమయం దొరకదు,
ఎవరో చేప్పిన ఎంగిలి మాటలు నాలుగు పట్టుకుని మనని, మన శాస్త్రాలను విమర్శిస్తు తిరుగుతుంటారు.
వారు అభ్యుదయభావాలు కల వారిగా ఊహాలోకాల్లో ఉంటారు.
అటువంటి వారికి మనం చెప్పేదేమీ లేదు*

సేకరణ మీ శ్రీశైల్
!..శుభోదయం..!